విజయదశమి సందర్భంగా ఆదివారం జరిగిన ప్రారంభ కార్యక్రమానికి రాష్ట్ర పర్యాటక శాఖామంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ వి వినయ్ చంద్, విశాఖ పార్లమెంటు సభ్యులు ఎం వీ వీ సత్యనారాయణ, మెట్రో రైలు ప్రాజెక్టు మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ పీ రామకృష్ణ రెడ్డి ,వి ఎం ఆర్ డి ఎ, జీవీఎంసీ కమిషనర్ లు కోటేశ్వరరావు, జి సృజన,శాసన సభ్యులు తిప్పల నాగిరెడ్డి, అదీప్ రాజ్ తదితరులు హాజరయ్యారు.
ఎల్ఐసి భవనసముదాయం లో నూతనంగా ఏర్పాటుచేసిన మెట్రోరైల్ ప్రాజెక్టు
కార్యాలయ ప్రారంభం అనంతరం , కాన్ఫరెన్స్ హాల్లో విశాఖలో ఏర్పాటు చేయబోయే మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను రాష్ట్ర మంత్రులు,అధికారులు తిలకించారు.
అనంతరం రాష్ట్ర మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ విలేకరుల తో మాట్లాడుతూ నూతనంగా రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచనలతో పరిపాలన వికేంద్రీకరణ చేపట్టిన నేపథ్యంలో విశాఖ అభివృద్ధి లో భాగంగా మెట్రో రైల్ ప్రాజెక్టు కు శ్రీకారం జరుగుతున్నదన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారులు, మంత్రులు క్షేత్రస్థాయిలో పర్యటించి డీ పీ ఆర్ ను ముఖ్యమంత్రి ఆమోదానికి పంపటం జరుగు తుందన్నారు.
విశాఖ మెట్రో రీజనల్ డెవలప్మెంట్ ఏరియా లో 79.91 కి మీ లైట్ మెట్రో రైలు కారిడార్ లు, అదేవిధంగా 60 కి మీ మేర మో డ్రన్ ట్రామ్ కారిడార్ ల అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ ను రూపొందించడం జరిగిందన్నారు.
లైట్ మెట్రో, మోడ్రన్ ట్రామ్ ల నిమిత్తం వేర్వేరుగా రెండు డీపీఆర్( డీటైల్డ్ ప్రాజెక్ట్) ల రూపకల్పన లకు యు ఎం టీ సి కన్సల్టెంట్ లను నియమించడం జరిగిందన్నారు.
మెట్రో డి పి ఆర్ ను ఈ సంవత్సరం నవంబర్ రెండో వారంలో నూ , మోడ్రన్ ట్రామ్ డి పి ఆర్ ను డిసెంబర్ రెండో వారంలో ప్రభుత్వానికి సమర్పించనున్నామన్నారు..
ట్రాఫిక్ ఇతర అంశాలపై క్షుణ్నంగా అధ్యయనం చేసిన అనంతరం 75.31 కి మీ లో 4 క్యారీడార్లలో 52 స్టేషన్లను ఏర్పాటు చేయాలని కన్సల్టెంట్లు సిఫార్సు చేశారన్నారు.
స్టీల్ ప్లాంట్ - కొమ్మాది జంక్షన్, గురుద్వారా - పాత పోస్ట్ ఆఫీస్, తాడిచెట్లపాలెం - చిన్న వాల్తేర్ , కొమ్మాది జంక్షన్ - భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు ప్రతిపాదనలను తయారు చేయడం జరిగిందన్నారు.
మోడ్రన్ ట్రామ్ కు సంబంధించి మూడు కారిడార్లలో 60. 20 కి మీ మేర డీ పీ ఆర్ ప్రతిపాదన ప్రక్రియ కొనసాగుతుందన్నారు.
ఎన్ఏడి - పెందుర్తి, స్టీల్ ప్లాంట్ గేటు - అనకాపల్లి , పాత పోస్టాఫీసు- భీమిలి బీచ్ రోడ్డు వయా రుషికొండ వరకూడీ పీ ఆర్ ల ప్రక్రియ జరుగు తున్నదన్నారు
లైట్ మెట్రో ప్రాజెక్టు డెవలప్మెంట్ కు సంబంధించిన టెండర్ల ప్రక్రియను నవంబర్ లో ప్రారంభించనున్నామని , అర్హతలున్న
డెవలపర్ల ఎంపిక ,కాంట్రాక్ట ర్ల సంతకం ప్రక్రియలన్నీ మార్చి 2021నాటికి పూర్తి అవుతాయని తెలిపారు.
రాష్ట్ర పర్యాటక శాఖామంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ నేడు
విశాఖ చరిత్రలో మరిచిపోలేని రోజు అని, ఆసియాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరంలో మెట్రో రైలు ప్రాజెక్టు రూపకల్పన మంచి ఆలోచన అని అన్నారు.విశాఖ ఆర్థికంగా శక్తి వంతమైన నగరమని, పెద్ద నగరాలకు ధీటుగా ఇంటర్నే షనల్ ఏర్పోట్ , మెట్రో రైల్ ప్రాజెక్టు లు రానున్నాయన్నారు. పరిశ్రమలు, విద్యాసంస్థలు ఎక్కువగా వస్తున్నాయని, వీటి ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మంచి విజన్, ఆలోచన, దృఢ సంకల్పంతో విశాఖ అభివృద్ధికి తోడ్పడుతున్నారన్నారు. విశాఖ అభివృద్ధికి రాజకీయాలకతీతంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
విలేఖర్ల సమావేశంలో మెట్రో రైల్ ప్రాజెక్టు ఎం డీ ఎన్ పి రామకృష్ణారెడ్డి, పార్లమెంటు సభ్యులు ఎం వి వి సత్యనారాయణ, శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి అదీప్ రాజు పాల్గొన్నారు.